విశాఖ దక్షిణం (స్వతంత్ర ప్రభ)
గురువారం దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్య నాయుడు 34 మరియు 37వ వార్డులలో గల భూపేష్ నగర్, బౌధార రోడ్డు, పెయిన్ దొరపేట, ఆసిపాప వీధి, ద్వారం వారి వీధి ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా 34వ వార్డు భూపేష్ నగర్లో టింబర్ డిపో యజమానులు రోడ్లను ఆక్రమించిన విషయాన్ని గమనించిన కమిషనర్ గారు, సంబంధిత యజమానులపై తగిన అపరాధ రుసుము విధించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వార్డులో కాలువల డీసిల్టేషన్ అనంతరం పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం 37వ వార్డు మెయిన్ దొరపేట, ఆసిపాప వీధి, ద్వారం వారి వీధి ప్రాంతాలలో పర్యటించిన సందర్భంగా, కొందరు ప్రజలు కాలువల్లో చెత్త వేస్తున్నట్లు గుర్తించి, సంబంధిత ఇళ్ల యజమానులకు హెచ్చరికలు జారీ చేయించారు. చెత్తను కాలువల్లో వేయకుండా, ఇంటి వద్దకు వచ్చే పారిశుధ్య కార్మికులకు అందజేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు.ఇకపై వార్డులలో ప్రజలకు తడి మరియు పొడి చెత్తను వేరు చేసి అందించే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత సానిటరీ ఇన్స్పెక్టర్కు ఆదేశించారు.ఈ పర్యటనలో వార్డు సానిటరీ ఇన్స్పెక్టర్ మీనా కుమారి, శ్రీ గీత, శానిటేషన్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.