వి.ఏం.అర్.డి.ఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్,
విశాఖపట్నం(స్వతంత్ర ప్రభ)
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్దే ధ్యేయంగా పని చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కి పెద్ద పీట వేస్తున్నామని వి.ఏం.అర్.డి.ఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ అన్నారు. మాడుగుల నియోజకవర్గం పరిధిలోని దేవరాపల్లి, కె కోటపాడు మండలాల్లో రూ 1.75 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు వి ఎం ఆర్ డి ఏ పరిధిలో అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మాడుగుల నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి గారి సూచనలతో నియోజకవర్గం పరిధిలో వి ఎం ఆర్ డి ఏ తరుపున సుమారు రూ 1.76 కోట్ల ను కేటాయించామని, అలానే ఇతర ప్రాంతాల అభివృద్ధి కి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.దేవరాపల్లి లో సుమారు రూ.76 లక్షలతో 2 ఎకరాల విస్తీర్ణంలో అందరికి ప్రయోజనకరంగా ఉండేలా పార్క్ ను అభివృద్ధి చేశామన్నారు. పిల్లల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, అందుకే ఇక్కడ జాగింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. అలానే కె.కోటపాడు లో సామాజిక అవసరాల నిమిత్తం సుమారు కోటి రూపాయల వ్యయంతో కళ్యాణ మండలం అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ గ్రామీణ నియోజకవర్గమైన మాడుగులకు వి ఎం ఆర్ డి ఏ నుంచి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం మంచి శుభపరిణామమని పేర్కొన్నారు. ఇందుకు వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ కి,మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ లకు నియోజకవర్గం ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ మాట్లాడుతూ ధన సంపద తో పాటు విజ్ఞాన సంపద కూడా అవసరమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణీకరణ దిశగా వి ఎం ఆర్ డి ఏ ద్వారా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సూచనలతో మరిన్ని అభివృద్ది పనులు చేపడతామని, పార్క్ లని నిర్వహణ చాలా ముఖ్యమని, దీనిపై స్థానిక సంస్థలు దృష్టి సారించాలని , పార్కు లు ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించాలని సూచించారు. వి ఎం ఆర్ డి ఏ తరుపున ప్రజా ప్రయోజన అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఇంజనీర్ వినయ్ కుమార్ పర్యవేక్షక ఇంజినీర్ భవానీ శంకర్ డి.ఎఫ్.ఓశిరీష, కార్యనిర్వహక ఇంజనీర్ రాంబాబు, పలువురు స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ ,ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి,మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ లు కలిసి దేవరపల్లి లో రూ.76 లక్షలతో నిర్మించిన పార్క్,పార్క్ ఆవరణలో నిర్మించిన సామాజిక భవనాలను ప్రారంభించారు. అలానే కె.కోటపాడు లో రూ. 1 కోటి రూపాయల తో నిర్మించనున్న కళ్యాణ మండపం నిర్మాణం కోసం భూమి పూజ చేశారు.