మరణించిన మిత్రుడి కుటుంబానికి రూ. 50 వేల ఆర్థిక సాయం
విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ)
అభిమానం అంటే కేవలం వెండితెరపై హీరోలను ఆరాధించడమే కాదు, కష్టాల్లో ఉన్న తోటి మనిషిని ఆదుకోవడమని విశాఖపట్నంలోని సూపర్స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానులు నిరూపించారు. ఇటీవల అకస్మాత్తుగా మరణించి తమను విడిచి వెళ్లిన ప్రాణ స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు గ్రేటర్ విశాఖ సిటీ వైడ్ ఘట్టమనేని ఫ్యాన్స్ అసోసియేషన్ మరియు బుజ్జి ఫ్రెండ్ సర్కిల్ ప్రతినిధులు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు.”మన మనిషి మనతో ఉన్నప్పుడే కాదు, మనల్ని విడిచి వెళ్ళిన తర్వాత కూడా ఆ కుటుంబానికి తోడుగా నిలబడటమే అసలైన బంధం” అని నమ్మిన అభిమానులు అందరూ కలిసి తమ వంతుగా విరాళాలు సేకరించారు. ఈ సేకరణ ద్వారా సమకూరిన 50వేల రూపాయల నగదును మరియు సుమారు 3,500 రూపాయల విలువైన నిత్యావసర సరుకులను మరణించిన స్నేహితుడి భార్యకు, వారి ఇద్దరు బిడ్డలకు అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా అభిమాన సంఘం సభ్యులు మాట్లాడుతూ.. తమ మిత్రుడు దూరమవ్వడం తీరని లోటని, తాము అందించిన ఈ చిన్న సహాయం ఆ కుటుంబ అవసరాలకు ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని భావోద్వేగంతో తెలిపారు. అభిమానులు చూపిన ఈ సేవా గుణం మరియు స్నేహబంధం పట్ల స్థానికులు అభినందనలు కురిపిస్తున్నారు.