షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్.
నెల్లూరు,(స్వతంత్ర ప్రభ)
నెల్లూరు నగరంలోని పరమేశ్వరి నగర్ నందు గల వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులను ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పరిశీలించారు. ముస్లిం మత పెద్దలతో కలిసి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రిత్విక్ సంస్థ ప్రతినిధులతో నిర్మాణ విషయాలపై చర్చించారు. అనంతరం అబ్దుల్ అజీజ్ మీడియా తో మాట్లాడుతూ, పకడ్బందీగా టెస్టులు చేసేందుకు స్కూలు నిర్మాణం ఆలస్యం అయిందని, అన్ని టెస్టులు చేసి డ్యాం కట్టడాలకు ఉపయోగించే జియో రీ ఎన్ఫోర్స్మెంట్ గ్రాన్యూల్ బెడ్ టెక్నాలజీతో నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. బ్లాక్ కాటన్ సాయిల్ కావటంతో సిపెజ్ ఎక్కువ వస్తుందని తొందరపడి కడితే సాంకేతిక సమస్యలు వస్తాయని తెలిపారు. భవిష్యత్తులో ఎంత సీపేజ్ వచ్చినా ఏం కాకుండా ఉండేలా డిజైన్ చేసి గుజరాత్ నుంచి మెటీరియల్ తెప్పించి నిర్మాణాన్ని ప్రారంభించామని తెలిపారు. జూన్ లో ఐదో తరగతి వరకు ప్రారంభించాలని అనుకున్నామని, ఒకవేళ నిర్మాణం పూర్తి కాకపోయినా ఇక్కడే ఒక బిల్డింగ్ రెంట్ కి తీసుకొని తరగతులు ప్రారంభించాలని ఆలోచిస్తున్నామని వివరించారు. మేము టార్గెట్ పెట్టుకొని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అది అర్థం చేసుకోకుండా వితండంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మంచి పనులను సైతం విమర్శించే దౌర్భాగ్య స్థితికి కొందరు దిగజారిపోయారని మండిపడ్డారు. అకడమిక్ ఇయర్ వేస్ట్ కాకుండా ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నామని చేసే వారిని నిరుత్సాహపరచవద్దని అన్నారు. 54వ డివిజన్ పరిధిలో కూడా మరో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మించేందుకు మంత్రి నారాయణ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇవన్నీ అసాధారమైన పనులని మన ఊర్లో జరుగుతున్నాయి కాబట్టి సాధారణమైన పనులు అనుకుంటున్నారని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా తనకు ఐదారు జిల్లాల నుండి ఫోన్లు వచ్చాయని తమకు కూడా స్థలం కేటాయిస్తే స్కూల్ నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపినట్లు వివరించారు. మన బిడ్డలకు మంచి విద్యను అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని విద్య కు పేదరికం అడ్డుకాకూడదనేది సీఎం చంద్రబాబు మంత్రులు లోకేష్ నారాయణల ఆలోచన అని అన్నారు. ఈ ఇంటర్నేషనల్ స్కూలు పూర్తయితే నెల్లూరు విద్యకు ల్యాండ్ మార్క్ అవుతుందని, సిఎస్ఆర్ నిధులు కేటాయించిన రిత్విక్ సంస్థకు యావత్ ముస్లిం ప్రజానీకం, నెల్లూరు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు స్కూల్లో చదివి పురోగతి సాధిస్తే ఆ పుణ్యం ప్రతి ఒక్కరికి వస్తుందని అన్నారు. కుల మతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమ సొంత పనిలా భావించి ఇన్వాల్వ్ అవ్వాలని కోరారు. కార్యక్రమంలో మైనుద్దీన్, సమీ హుసేని, ఇంతియాజ్, సాబీర్ ఖాన్, కరిముల్లా, జహీర్, నన్నేసాహెబ్, రియాజ్, మౌలానా ఇలియాస్, హయాద్ బాబా, తదితరులు పాల్గొన్నారు.