వైభవంగా అన్నసమారాధన..

విశాఖ దక్షిణం (స్వతంత్ర ప్రభ)
విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని ఆశీపాప వీధిలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ సత్య పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు పర్వంలో భాగంగా మే 5వ తేదీన ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన భారీ అన్నదాన కార్యక్రమం భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.ముగింపు వేడుకలను పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే అమ్మవారికి జలాభిషేకాలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా ‘మార్వరం’ వేడుకను భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణలో సుమారు రెండు వేల మందికి పైగా భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు.భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.ఈ వేడుకల్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పూడి వరప్రసాద్ మరియు అక్షర కిరణం దిన పత్రిక ఎడిటర్ పూజారి సత్యనారాయణ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు స్థానిక రాజకీయ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎంతో నిష్టతో శ్రమించి ఈ జాతర మహోత్సవాలను, అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన తీరును భక్తులు అభినందించారు.