
విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)
దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు 35వ వార్డులోని జీవీఎంసీ మార్కెట్ వార్డ్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి “బడీ పిలుస్తోంది” కార్యక్రమం అమలును పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా 35వ వార్డుకు చెందిన ముగ్గురు చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ విద్యా సౌకర్యాలు, ఆంగ్ల మాధ్యమ బోధనతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.జోనల్ కమిషనర్ చొరవతో ముగ్గురు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం జరిగింది. అదేవిధంగా, ఆ విద్యార్థుల విద్యాభ్యాసానికి ప్రోత్సాహంగా స్వయంగా తన సొంత ఖర్చులతో ఒక విద్యా సంవత్సరానికి అవసరమైన నోట్బుక్స్ను అందజేస్తానని ప్రకటించారు. విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, వారి విద్యాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు.అనంతరం 35వ వార్డులోని వేలంపేట పోస్ట్ ఆఫీస్ రోడ్డు ప్రాంతంలో “బడీ పిలుస్తోంది” కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. ప్రతి చిన్నారి పాఠశాలలో చేరి విద్యను అభ్యసించేలా తల్లిదండ్రులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయని, విద్య హక్కును ప్రతి చిన్నారి సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడీ ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.