అరకులోయలో పోలీసుల భారీ అవగాహన ర్యాలీ
అరకులోయ, (స్వతంత్ర ప్రభ)
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు, అరకులోయ పోలీసుల ఆధ్వర్యంలో మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ నాలుగు రోడ్ల జంక్షన్ వరకు ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా మహిళలు, విద్యార్థినులు “స్త్రీ శక్తి – భారతదేశ భవిష్యత్తు”, “ఇల్లాలి చదువు – ఇంటికి వెలుగు” అంటూ నినాదాలు చేస్తూ పరిసర ప్రాంతాలను హోరెత్తించారు. అనంతరం ప్రధాన జంక్షన్ వద్ద భారీ మానవహారం నిర్వహించి మహిళా రక్షణపై నినదించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న విజయనగరం జోన్ ఆర్టీసీ చైర్మన్ సియారి దున్నుదొర మరియు చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా మాట్లాడుతూ.. సమాజంలో స్త్రీలు తమకు చట్టపరంగా ఉన్న హక్కుల పట్ల, తమ రక్షణ కోసం ఉన్న చట్టాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. మహిళా భద్రత విషయంలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని, చట్టాలపై అవగాహనతోనే వేధింపులను ఎదుర్కోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో అరకు సీఐ ఎల్. హిమగిరి, ఎస్ఐ టి. మల్లేశ్వరరావు, వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు, విద్యార్థినులు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.