విశాఖ దక్షిణం ,(స్వతంత్ర ప్రభ )
నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జబ్బర్ తోట ప్రాంతానికి చెందిన వంక గగన్ అనే ఏడేళ్ల బాలుడు గత కొంతకాలంగా తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ బాలుడి వైద్య ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో, తల్లిదండ్రులు ఆ భారాన్ని భరించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ హృదయ విదారక ఉదంతం వన్ టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ (సీఐ) పూడి వరప్రసాద్ దృష్టికి వచ్చింది. బాలుడి పరిస్థితిపై తక్షణమే స్పందించిన ఆయన, మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి అండగా నిలిచారు. జబ్బర్ తోటలోని ఆ అబ్బాయి నివాసానికి స్వయంగా వెళ్లిన సీఐ వరప్రసాద్, బాలుడి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన వంతు సహాయంగా రూ.10 వేల రూపాయలు నగదును ఆర్థిక సహాయంగా తల్లిదండ్రులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ, అధైర్యపడవద్దని, బాబు కోలుకుంటాడని భరోసా ఇచ్చారు. అనంతరం సీఐ వరప్రసాద్ మాట్లాడుతూ.. “చిన్న వయసులోనే బాబు ఇలాంటి పెద్ద వ్యాధితో బాధపడటం బాధాకరం. ఈ కుటుంబానికి మరిన్ని వైద్య ఖర్చులు అవసరమవుతాయి. కాబట్టి సమాజంలోని దాతలు, స్వచ్ఛంద సంస్థలు మానవత్వంతో ముందుకొచ్చి, ఈ చిన్నారి వైద్య నిమిత్తం తమకు తోచిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలి” అని పిలుపునిచ్చారు.పోలీస్ అధికారిగా విధి నిర్వహణలోనే కాకుండా, కష్టాల్లో ఉన్న పేద కుటుంబానికి స్వయంగా వెళ్లి సహాయం చేసిన సీఐ పూడి వరప్రసాద్ను స్థానికులు మరియు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలతో అభినందించారు.