ఎస్సీ కమిషన్ సభ్యునికి వినతి.
విశాఖపట్నం, (స్వతంత్ర ప్రభ)
చినగదుల పంచాయతీ వయా అడవివరం బి.ఆర్.టి.ఎస్ రోడ్డు విస్తరణలో భాగంగా తమ ఇళ్లను కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాంకు బాధితులు, పలువురు నాయకులు కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేశారు. విఎంఆర్డిఏ కార్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో ఈ వినతిపత్రం సమర్పించడం జరిగింది.రోడ్డు విస్తరణ కారణంగా ఇళ్లు కోల్పోయి రోడ్డున పడిన మిగిలిన 105 మందికి పునరావాసం (రిహాబిలేషన్) కింద తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా వారు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా వీరిలో అత్యంత దీనస్థితిలో ఉన్న 20 మంది కుటుంబాల జాబితాను ప్రత్యేకంగా అందజేస్తూ, వారికి వెంటనే స్థలాలు కేటాయించాలని లేదా ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ 2.0 పథకం కింద ఇళ్లను మంజూరు చేసి ఆదుకోవాలని వారు కోరారు. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించిన ఎస్సీ కమిషన్ సభ్యులు, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఈతలపాక సుజాత, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు చొక్కాకుల రాంబాబు, అనకాపల్లి జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు పి.ఎం. రాజు, బీజేపీ సీనియర్ నాయకులు ఓ.ఆల్బర్ట్, ఎన్.ఎస్.సి.ఆర్.పి.ఎస్ ప్రధాన కార్యదర్శి దశమంతల స్వామి, జగదీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.