దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్య నాయుడు

విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)
దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్య నాయుడు 35వ వార్డులోని పందెం పుల్లల సందు, పువ్వుల సందు, వెలంపేట మెయిన్ రోడ్డు, పూర్ణ మార్కెట్, అరటిపళ్ల సందు తదితర ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా ఆయా ప్రాంతాల్లో ప్రజలు మరియు వ్యాపారస్తులు కాలువల్లో చెత్తను వేయడం వల్ల పారిశుద్ధ్య సమస్యలు ఏర్పడుతున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా సంబంధిత వ్యాపారస్తులు మరియు ఇంటి యజమానులను గుర్తించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన అపరాధ రుసుము విధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజల్లో అవగాహన కల్పించి, ఇంటింటికీ వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు లేదా చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే చెత్తను అందించే విధంగా ప్రజల సహకారం తీసుకోవాలని సంబంధిత పారిశుద్ధ్య విభాగానికి సూచించారు.అదేవిధంగా, కొన్ని ప్రాంతాలలో మలేరియా నియంత్రణ కార్యక్రమాలు సక్రమంగా అమలు కావడం లేదని గుర్తించి, సంబంధిత సూపర్వైజర్పై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అలాగే వెలంపేట పూల సందులో గుర్తించిన జివిపి పాయింట్లను గ్రీన్ స్పాట్లుగా అభివృద్ధి చేయాలని, అలాగే బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్న వ్యాపారస్తులు మరియు ప్రజలను గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ పర్యటనలో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణంరాజు, సానిటరీ సూపర్వైజర్ కామేశ్వర్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ శివప్రసాద్, వాటర్ సప్లై మరియు ఎలక్ట్రికల్ విభాగాలకు చెందిన అధికారులు, 35వ వార్డు సచివాలయ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.