విశాఖ దక్షిణం,మార్చి:16(స్వతంత్ర ప్రభ)
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సౌత్ జోనల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగస్ఫూర్తిని ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది స్మరించుకున్నారు.1901 మార్చి 16న జన్మించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మహాత్మా గాంధీ ఆశయాలను ఆచరణలో పెట్టిన మహోన్నత స్వాతంత్ర్య సమరయోధుడు.భాషా ఆధారంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ఆయన 1952లో చేపట్టిన 56 రోజుల నిరాహార దీక్ష దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. ఆయన త్యాగం ఫలితంగానే భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, సౌత్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు మాట్లాడుతూ, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం అపారమని, వారి సేవలు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. సమాజ సేవ, నిబద్ధత, త్యాగం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడంలో అధికారులు, సిబ్బంది మరింత బాధ్యతతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సౌత్ జోన్కు చెందిన వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.