జెఎన్టీయుకె లో ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు
కాకినాడ,(స్వతంత్ర ప్రభ)
జెఎన్టీయుకె ప్రాంగణంలో శనివారం వీసీ కాన్ఫరెన్స్ హాల్ లో ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఓఎస్డ్ ప్రొ.డి.కోటేశ్వరరావు,రిజిస్ట్రార్ ప్రొ.ఆర్.శ్రీనివాసరావు, యుసిఇకె ప్రిన్సిపాల్ ప్రొ.కె. పద్మరాజు, అధికారులు విచ్చేసి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఓఎస్డ్ ప్రొ.డి.కోటేశ్వరరావు కార్యక్రమానికి అధ్యక్షత వహించి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ప్రొ.డి.కోటేశ్వరరావు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే సమాజ సంస్కరణలోఅగ్రగామి నాయకుడని, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అమూల్యమని పేర్కొన్నారు. సమానత్వం,సామాజిక న్యాయం, స్త్రీ విద్య ప్రోత్సాహం వంటి ఆయన ఆశయాలు నేటికీ మార్గదర్శకాలని తెలిపారు. విద్య ద్వారానే సమాజ మార్పు సాధ్యమని ఫూలే భావజాలం గొప్పదని చెప్పుతూ, విద్యార్థులు సమాజ పట్ల బాధ్యతతో ముందుకు సాగాలని, అన్యాయం మరియు వివక్షకు వ్యతిరేకంగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఫూలే ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు.రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్. శ్రీనివాసరావు మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే భారతదేశంలో సామాజిక సమానత్వానికి పునాది వేసిన మహానుభావుడని పేర్కొన్నారు. విద్య ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆయనసంకల్పం అత్యంత ప్రాముఖ్యమైనదని తెలిపారు. అణచివేతకు గురైన వర్గాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సమాజంలో కుల, లింగ వివక్షలను తొలగించడానికి ఆయన చేసిన కృషి ఆదర్శప్రాయమని చెప్పారు.విద్యార్థులు ఆయన జీవితం నుండి స్ఫూర్తి పొందాలని, సమానత్వం మరియు సహనాన్ని తమ విలువలుగా స్వీకరించాలని సూచించారు. మహానుభావుల జయంతులను జరుపుకోవడం ద్వారా వారి ఆశయాలను ఆచరణలోకి తీసుకురావాలని,ఫూలే మార్గంలో నడవడం ద్వారా సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. పద్మరాజు మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే ఆలోచనలు విద్యా వ్యవస్థకు మార్గదర్శకాలని పేర్కొన్నారు. సమాన విద్యా అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో అసమానతలను తొలగించవచ్చని అన్నారు. విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా విలువలలోనూ ఎదగాలని సూచించారు. సమాజ సేవ భావనతో ముందుకు సాగడం ద్వారా నిజమైన విద్యార్థులుగా నిలుస్తారని తెలిపారు. ఫూలే ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు,అధ్యాపకులు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, తదితరులు పాల్గొన్నారు.