వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
మేకపాటి రాజగోపాల్ రెడ్డి..
ఉదయగిరి,ఏప్రిల్:16(స్వతంత్ర ప్రభ)
ఉదయగిరి నియోజకవర్గంలోని శనగ రైతుల ఆవేదన కూటమి ప్రభుత్వానికి, అధికారులకు కనిపించడం లేదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. నియోజకవర్గంలో శనగ పంట చేతికొచ్చి రైతులు సిద్ధంగా ఉన్నా, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వరికుంటపాడు, వింజమూరు మండలాల్లో ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.ప్రభుత్వ కొనుగోలు లేకపోవడంతో పంట పుచ్చుతుందనే భయంతో రైతులు తక్కువ ధరకే దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, దీనివల్ల పెట్టుబడులు కూడా రాక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని మేకపాటి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వెంటనే తన నిర్లక్ష్యాన్ని వీడి, మద్దతు ధరతో పూర్తి పంటను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని ఈ సందర్భంగా అధికారులను, ప్రభుత్వాన్ని మేకపాటి రాజగోపాల్ రెడ్డి కోరారు.