గాజువాక, (స్వతంత్ర ప్రభ)
గాజువాకలో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడి కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను గాజువాక శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్న ఆయన, వారికి ఎలాంటి లోటు లేకుండా అత్యుత్తమ, మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అక్కడి అధికారులకు, వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాద బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన నష్టపరిహారం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానని హామీ ఇచ్చారు. అలాగే, ప్రమాద వార్తతో ఆందోళనలో ఉన్న బాధితుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, క్షతగాత్రులందరూ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.