వన్టౌన్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు
విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)
విశాఖపట్నం కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న ఒక యువకుడు ఎవరికీ చెప్పకుండా ఆసుపత్రి నుండి వెళ్లిపోయి అదృశ్యమైన ఘటనపై నగరంలోని వన్టౌన్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి…
అనకాపల్లి ప్రాంతంలోని మొగిలివాడ, రిక్షా కాలనీకి చెందిన పల్లా వెంకట నరేంద్ర (26) (తండ్రి: దేముడు) అనే యువకుడు చిన్నతనం నుండి ఫిట్స్ (మూర్ఛ వ్యాధి)తో బాధపడుతున్నాడు. అతను విశాఖ కేజీహెచ్లో వైద్య చికిత్స పొందుతున్నాడు. కాగా, గత నెల మే 28వ తేదీన అతనికి తీవ్రమైన ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు తక్షణమే అనకాపల్లి నుండి విశాఖపట్నం కేజీహెచ్కు తరలించి చికిత్స నిమిత్తం చేర్పించారు.కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వెంకట నరేంద్ర, మే 30వ తేదీ సాయంత్రం సుమారు 7:30 గంటల సమయంలో ఆసుపత్రిలోని ఎవరికీ చెప్పకుండా అకస్మాత్తుగా బయటకు వెళ్లిపోయాడు. అప్పటినుండి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ ఎంత వెతికినా అతని ఆచూకీ లభించలేదు. దీనితో ఆందోళన చెందిన అతని తల్లి పల్లా ఈశ్వరమ్మ ఆదివారం (జూన్ 07) విశాఖపట్నం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అదృశ్యమైన పల్లా వెంకట నరేంద్రను గుర్తించినా లేదా అతని గురించి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే ఈ కేసు దర్యాప్తు అధికారి అయిన వన్టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్.ఐ) వై. రవికిరణ్ను కలిసి వివరాలు తెలియజేయాల్సిందిగా ఎస్ఐ రవికిరణ్ ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఉన్నవారు స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించవచ్చునని కోరారు.