విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)
త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రత్యేక ఓటర్ల నమోదు, సవరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ఇంటింటి సర్వేను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. సోమవారం స్థానిక కమ్యూనిటీ హాల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం 39వ వార్డు టీడీపీ సర్వసభ్య సమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నిర్వహించే ఈ ప్రత్యేక సర్వే ప్రక్రియలో 39వ వార్డులోని బూత్ ఏజెంట్లు అందరూ స్వయంగా, చురుగ్గా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సర్వేను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా బూత్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ తరగతులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. పార్టీ శ్రేణుల నడుమ ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ సర్వసభ్య సమావేశంలో 39వ వార్డు పార్టీ అధ్యక్షులతో పాటు క్లస్టర్ ఇన్ఛార్జ్లు, బూత్ కన్వీనర్లు, కో-కన్వీనర్లు, వార్డు కార్యవర్గ సభ్యులు, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.