కాకినాడ, (స్వతంత్ర ప్రభ )
జెఎన్టియుకె ప్రాంగణంలో మంగళవారం భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.యూనివర్సిటీ ఓఎస్డి ప్రొ.డి.కోటేశ్వరరావు, రెక్టార్ ప్రొ.పి. సుబ్బారావు, మరియు రిజిస్ట్రార్ ప్రొ.ఆర్.శ్రీనివాసరావు యుసిఇకె ప్రిన్సిపాల్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సెనేట్ హాల్లో జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ.. సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చేసిన కృషి అపారమని కొనియాడారు. విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని నిరూపించిన ఆయన జీవితం యువతకు గొప్ప ప్రేరణని తెలిపారు. విద్యార్థులు ప్రతిభతో పాటు క్రమశిక్షణ, సమయపాలనను అలవరుచుకోవాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, బోధన, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


