..హాజరైన. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
నెల్లూరు, (స్వతంత్ర ప్రభ ప్రతినిధి )
కోవూరులోని సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ కోదండరామ స్వామి ఆలయ నూతన ట్రస్టు బోర్డు ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యురాలువేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన నూతన ధర్మకర్తల మండలి ఛైర్మన్ క్రిష్ణా రెడ్డికి, ఇతర బోర్డు సభ్యులు పోరండి నాగలక్ష్మి, యనమల రామచంద్రయ్య, చీకటి లక్ష్మి, అనంతసాగరం రవి, కొప్పోలు ప్రసాద్, కర్రిఆవుల సుధాకర్, నిమ్మల ఆదిలక్ష్మమ్మ, తిరుమంచి కౌశల్యమ్మ, పరంకుశం శ్రీకాంత్ లకి ఎమ్మెల్యే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, ఆలయ నిర్మాణం, పునరుద్ధరణ లేదా ఆలయ సేవ చేసే అవకాశం లభించడం ఎన్నో జన్మల పుణ్యఫలమని అన్నారు. తాను మూడు పర్యాయాలు తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ట్రస్టు బోర్డు సభ్యురాలిగా సేవలందించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, అన్ని పదవుల కంటే ఆ బాధ్యతనే అత్యున్నతమైనదిగా భావిస్తానని పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులు నూతన ట్రస్టు సభ్యులందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆలయంలో ఆగమశాస్త్రాలు, సాంప్రదాయ ఆచారాలకు అనుగుణంగా నిత్య పూజలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆలయ పవిత్రతను పరిరక్షిస్తున్న ట్రస్టు సభ్యులను అభినందించారు. రాబోయే రోజుల్లో శ్రీ కోదండరామ స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి, ఆలయ వైభవాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అవసరమైన ప్రతి విషయంలో తన సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కోదండరామ స్వామి వారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.





