గిరిజన సంఘాల నాయకులు, న్యాయ నిపుణులతో హోంమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆత్మీయ సమావేశం
పాడేరు,(స్వతంత్ర ప్రభ)
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి మంగళవారం పాడేరులోని శంకరన్ ఆడిటోరియంలో గిరిజన సంఘాల నాయకులు, న్యాయ నిపుణులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, గిరిజనులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి. నిషాoతి, జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, పోలవరం జిల్లా కలెక్టర్ కే.దినేష్ కుమార్, పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ వైశాలి, ఎస్పీ మాధవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గిరిజన సంఘాల ప్రతినిధులు భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్, జి.ఓ. ఎం.ఎస్. నెం. 3, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ఏరియాస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్, 1959 (రెగ్యులేషన్–1 ఆఫ్ 1970) అమలుకు సంబంధించిన అంశాలపై తమ అభిప్రాయాలు, సమస్యలు, సూచనలను మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు.గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ, గిరిజనుల సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిగణిస్తోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం గిరిజనుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉందని తెలిపారు. న్యాయ నిపుణులతో సమగ్రంగా చర్చించి, రాజ్యాంగ, చట్టపరమైన అంశాలను పరిశీలించిన అనంతరం గిరిజనులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా కొందరు గిరిజన ప్రతినిధులు గంజాయి వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేస్తూ, గంజాయి నిర్మూలనకు మరింత కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై స్పందించిన రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, గంజాయి రహిత సమాజ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గంజాయి అక్రమ సాగు, రవాణా, విక్రయాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈగల్ బృందం, పోలీసు శాఖ సంయుక్తంగా గంజాయి నిర్మూలన కోసం కృషి చేస్తూ గ్రామసభలు నిర్వహించడం, విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని పేర్కొన్నారు. గంజాయి నిర్మూలనలో ప్రజలు ఈగల్ బృందం సేవలను సద్వినియోగం చేసుకొని పూర్తి సహకారం అందించాలని పిలుపునిచ్చారు.గిరిజనుల అభిప్రాయాలు, న్యాయ నిపుణుల సూచనలు, పరిపాలనా అంశాలను సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు అల్లూరి సీతారామరాజు, పోలవరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రులు తెలిపారు.





