
జిఒ-3 కి ప్రత్యామ్నాయం జి.ఓ తక్షణమే ఇవ్వాలి..
జోన్-1లో అల్లూరి జిల్లా కై , డిమాండ్…
ఎ.ఎస్.ఆర్ జిల్లా,(స్వతంత్ర ప్రభ)
జిల్లా కేంద్రం పాడేరులో శుక్రవారం జిఒ-3 రిజర్వేషన్ ప్రత్యామ్నాయం, అల్లూరి జిల్లాను జోన్-1లోనే కొనసాగించడం, 1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో చేరుకుని అక్కడ నుంచి ర్యాలీగా ఐటిడిఎ గేటు ఎదుట చేరుకుని నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి అల్లూరి జిల్లా ఏజెన్సీ నలుమూలల నుంచి ఆదివాసీలు వేలాదిగా తరలి వచ్చారు. ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా ASR సోషల్ మీడియా కంటెంట్ క్రివేటర్స్ ప్రతినిధుల పిలుపుతో గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణ, కొంటా సుదీర్ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడిన నేతలంతా గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. పేర్కొన్న డిమాండ్లపై ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఆదివాసీ నేతలు అల్టిమేటం జారీ చేశారు. ఈ సందర్భంగా అప్పలనర్స మాట్లాడుతూ, తాము చట్టాలకు లోబడి ఉద్యమం చేస్తున్నామని, అధికారులు మాత్రం గిరిజన సక్రమంగా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిఒ 3 రిజర్వేషన్ పై సిఎం చంద్రబాబు హామీని నిలబెట్టుకోవాలన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో 22 ఏప్రిల్ 2020లో జిఒ-3ని రద్దు చేస్తూ సుప్రీం తీర్పు ఇచ్చినప్పటినుంచి ఆదివాసీలు జిఒ-3 రిజర్వేషన్ కాపాడాలని డిమాండ్ చేస్తూ వివిధ రూపాల్లో వినతులు, విజ్ఞప్తులు, నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారన్నారు. గత వైసిపి ప్రభుత్వం, ప్రస్తుత టిడిపి కూటమి ప్రభుత్వం ఆదివాసీల రిజర్వేషన్ సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వ్యవహరించాయని వివరించారు. అరకు ఎన్నికల సభలో చంద్రబాబు హామీ నేటికీ అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. రంపచోడవరం లో 24న వస్తున్నా CM ప్రత్యామ్నాయం GO జారీ పై షెడ్యూల్డ్ ప్రకటించాలని లేని వెడల అగస్ట్ 8.9న రాష్ట్ర మన్యం బంద్ కు పిలుపునిచ్చారు. అవసరం అయితే ప్రభుత్వం నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ను కూడ బహిష్కరణ కు పిలుపు ఇస్తామని అన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో భాగమైన ప్రస్తుత అల్లూరి జిల్లాను జోన్-1లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. జోన్-1లోనే గిరిజన యువతకు ఉద్యోగావకాశాలు, ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల్లో న్యాయం జరుగుతోందని, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు. 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ సంవత్సరాలుగా గిరిజనులు ఉద్యమిస్తున్న ప్రభుత్వాలు చట్టం అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ, బినామీ పేర్లతో గిరిజనేతరులు చేపట్టిన నిర్మాణాలను కూర్చి వేయాలని, ఎల్ టిఆర్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.గిరిజన ప్రాంత మనుగడను ప్రభావం చేసే కీలక అంశాలు ఒకదాని తర్వాత ఒకటి తెరపైకి వస్తున్న తరుణంలో చట్టసభల్లో చురుకుగా పాల్గొని గిరిజన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గిరిజనుల కోసం పోరాడతారని గెలిపించిన ఎమ్మెల్యేలు, గిరిజనుల కన్నా సొంత, పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ అసెంబ్లీకి వెళ్ళని ఎమ్మెల్యేలు అవసరమా..? అని ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్లి ప్రజల గొంతుకగా నిలవని ఎమ్మెల్యేలు అవసరమా? అనే ప్రశ్న ప్రస్తుతం అల్లూరి జిల్లాలో చర్చనీయాంశంగా మారిందన్నారు. కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నాయకులు పొద్దు బాలదేవ్, పి.సత్యనారాయణ, బైరీ సురేష్, ధర్మాన పడాల్, కుడుముల కాంతారావు, మోహన్, ధ్రువ వెంకటరమణ శశికిరణ్, వందేమాతరం శ్రీనివాస్, వై.కుమార్, వి.నాగేశ్వరరావు, హైమావతి, వైసిపి నాయకులు, పెద్ద ఎత్తున గిరిజనులు, తదితరులు పాల్గొన్నారు.





