ఎ ఎస్ ఆర్ జిల్లా, (స్వతంత్ర ప్రభ)
అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఆదివాసీ మహాగర్జన ర్యాలీ, బహిరంగ సభ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ను పేల్చివేస్తామని కొందరు వ్యక్తులు చేసినట్లు ప్రచారంలో ఉన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఏఎస్ఆర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) అమిత్ బర్దార్ తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రభుత్వ కార్యాలయాలు లేదా ప్రభుత్వ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఎటువంటి బెదిరింపు వ్యాఖ్యలు చేసినా అవి తీవ్రమైన నేరంగా పరిగణించబడతాయని, అలాంటి చర్యలపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై చట్టంలోని నిబంధనల మేరకు తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రతి పౌరుడికి ప్రజాస్వామ్యబద్ధంగా తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే హక్కు ఉన్నప్పటికీ, ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వ ఆస్తులను బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేయడం గానీ, అలాంటి చర్యలకు ప్రేరేపించడం గానీ చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అమిత్ బర్దార్ హెచ్చరించారు.





