ఎస్ ఎస్ సి, ఇంటర్లో టాపర్లను సత్కరించిన పాఠశాల విద్యాశాఖ
-జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ…
ఏ ఎస్ ఆర్ జిల్లా, (స్వతంత్ర ప్రభ)
అల్లూరి జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో 2026 ఎస్ఎస్సి & ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు “షైనింగ్ స్టార్స్-2026” సత్కార కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. పాడేరుమండలం, కుమ్మరిపుట్టులోని ఎస్.ఆర్. శంకరన్ ఆడిటోరియంలో ఈరోజు ఉదయం ఈ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ, పాడేరు మాజీ శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి, డీఈవో, ఆర్డిఓ, కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి నిరంతర శ్రమ, అంకితభావం, సరైన ప్రణాళికే ప్రధాన సాధనాలని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వక్తలు పాల్గొని విద్యార్థులకు, తల్లిదండ్రులకు మార్గదర్శకత్వం చేశారు.ఈ సందర్భంగా మొదటి వక్త (పూర్వ విద్యార్థి) తన విద్యార్థి జీవిత అనుభవాలను పంచుకుంటూ, “మనలో గర్వం ప్రవేశిస్తే ప్రగతి అక్కడితో ఆగిపోతుంది. ఏ విజయమైనా నిరంతర శ్రమ ద్వారానే సాధ్యమవుతుంది” అని హితవు పలికారు. ప్రారంభంలో వచ్చే ఒడిదొడుకులకు భయపడవద్దని, నిలకడైన శ్రమతో అసలైన ప్రతిభను బయటకు తీయవచ్చని విద్యార్థులకు ధైర్యం చెప్పారు. అలాగే, జీవితంలో అనుకున్న లక్ష్యాలు మారినప్పుడు నిరాశ చెందకుండా ఎల్లప్పుడూ ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికను (ప్లాన్ బి) సిద్ధంగా ఉంచుకోవాలని, ఐఐటి కాకపోయినా ఎన్ఐటి ద్వారా, లేదా అబ్రాడ్ వెళ్ళే అవకాశం లేకపోయినా ఏఐ వర్క్షాప్స్, ఫుల్ స్టాక్ డెవలపర్ వంటి ఆధునిక కోర్సుల ద్వారా రాణించవచ్చని సూచించారు. పిల్లలు నిరుత్సాహపడినప్పుడు తల్లిదండ్రులు వారిలోని బలాన్ని గుర్తుచేస్తూ ప్రోత్సహించాలని కోరారు.పాడేరు మాజీ శాసనసభ్యులు గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా టాపర్స్గా నిలిచిన విద్యార్థులను గౌరవించడానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో “షైనింగ్ STARS” అనే అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు గోల్డ్ మెడల్, సర్టిఫికేట్తో పాటు రూ.20,000 నగదు బహుమతిని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పురస్కారం విద్యార్థుల ఉన్నత చదువులకు ఎంతో దోహదపడుతుందని, మిగిలిన పిల్లల్లో కూడా ఒక సరికొత్త స్ఫూర్తిని నింపుతుందని ఆమె పేర్కొన్నారు.అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, వారిని తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ఈ విద్యాసంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా అసాధారణ ప్రతిభ కనబరిచి, అత్యుత్తమ మార్కులతో టాప్ ర్యాంకులు సాధించిన పలువురు విద్యార్థులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా సత్కరించి పురస్కారాలను అందజేశారు.పురస్కారాలు అందుకున్న విద్యార్థుల వివరాలు మండలాల వారీగా తెలియజేయడమైనది. పాడేరు మండలం, ఎ. శ్రీవంధన్, బి. గాయత్రి, రవి నవీన్, ఎస్. సోమేష్, పి. మానస్.అరకు వ్యాలీ మండలం, డి. మౌనిక, ఆర్.ఎల్.ఎస్. వర ప్రసాద్. చింతపల్లి మండలం: జి. భవిష్య కాట్వి, డి. స్నేహలత, పి. పూజిత దుర్గ, జి. లక్ష్మి ప్రియ రాజు, వి. ప్రణతిరూప, పి. చైత్ర,జి.కె. వీధి మండలం, జి. సాయి రామ కాంత్, ఎల్. ప్రియాంక, కె. వెంకట లక్ష్మి, ఎల్.ఆర్.బి. కామేష్, పి. ధార స్మైలీ,పెదబయలు మండలం, కె.జె.ఏలియా, ఎ. మాధురి,అనంతగిరి మండలం, ఆర్. పార్థసారధి, జె. నరసింగరావు,డంబ్రిగుడ మండలం, ఎస్. అనూషా ,జి. మాడుగుల మండలం, ఎస్. నాని. కొయ్యూరు మండలం, జి. సంతోష్.ముంచింగిపుట్టు మండలం, పి. దేవి. అవార్డుసు దక్కించుకున్నారు. గిరిజన ప్రాంత విద్యార్థులు సాధించిన ఈ అద్భుత ప్రగతిని విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులు మరియు పలువురు ప్రముఖులు అభినందించారు. రాబోయే రోజుల్లో ఈ విద్యార్థులు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఈ విజయం తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. పిల్లల యొక్క భవిత, భవిష్యత్తును సంబంధించిన క్లిప్పింగ్స్ క్షుణ్ణంగా పరిశీలించి , పిల్లలతో ముఖాముఖి మాట్లాడిన జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ.





