పాడేరు పోలీస్ స్టేషన్కు జిఒ 3, 1/70 ఆందోళన నాయకుల హాజరు…!?
పాడేరు,(స్వతంత్ర ప్రభ)
జీవో నంబరు–3 రిజర్వేషన్ పునరుద్ధరణ, 1/70 భూబదలాయింపు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలనే డిమాండ్లతో శుక్రవారం పాడేరులో నిర్వహించిన గిరిజనుల ఆందోళన సందర్భంగా అభ్యతకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు నాయకులు సోమవారం విచారణ నిమిత్తం పాడేరు పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు.ఐటీడీఏ కార్యాలయం ఎదుట జరిగిన నిరసనలో కొందరు వక్తలు కలెక్టరేట్ను బద్ధలు కొడతామని వ్యాఖ్యానించినట్లు పోలీసుల దృష్టికి వచ్చిన నేపథ్యంలో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.ఈ క్రమంలో నోటీసులు అందుకున్న కొందరు ఆందోళనాకారులు సోమవారం పాడేరు పోలీస్ స్టేషన్కు చేరుకుని పోలీసుల ఎదుట హాజరుకావడం జరిగింది. వారి నుంచి వివరణలు నమోదు చేసి, సభలో చేసిన ప్రసంగాల వీడియోలు, ఇతర ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. విచారణ పూర్తైన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విచారణకు హాజరైన వారిలో పి.అప్పలనర్స, కూడా రాధాకృష్ణ, కర్జ వైకుమార్, కొర్ర కార్తిక్, వంతల దాస్, కొంట సుధీర్ కుమార్, లోకేష్, కొర్ర రాజశేఖర్ ఉన్నారు.ఈ సందర్బంగా పి. అప్పల నరస మాట్లాడుతూ పోలీస్ విచారణ కు సంపూర్ణం గా సహకారం అందిస్తామని, ప్రభుత్వం ఆస్తులు ధ్వసం చేసే ఉద్యమ విధానం మాది కాదని, అభ్యతకర వాక్యాలపై విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆదివాసీ ఉద్యమకారులపై ప్రభుత్వం కక్ష సాధింపు తగదన్నారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై న్యాయస్థానం నీ ఆశ్రయిస్తాం అని అన్నారు.





