అర్జీదారుల వద్దకు వచ్చి వినతులు స్వీకరించిన చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్.
విజయనగరం,(స్వతంత్ర ప్రభ)
విజయనగరం వి ఎం ఆర్ డి ఎ జోనల్ కార్యాలయంలో మంగళవారం వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ నేతృత్వంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కి విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున అర్జేదారులు రావటంతో వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ వారందరి వద్దకు వచ్చి వినతులు తీసుకున్నారు. ఆయన స్వయంగా అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా వినతులను పరిశీలించి తర్వాత సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని, అవసరాన్ని బట్టి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని ఆదేశించారు. అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. వి ఎం ఆర్ డి ఎ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను విన్నవించటానికి విశాఖ వరకు రానవసరం లేదని, విజయనగరంలో జోనల్ కార్యాలయం ఏర్పాటు చేయటం జరిగిందని, ఇక్కడ ప్రతీ మంగళవారం ప్రజా దర్బార్ జరుగుతుందని, విజయనగరం జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కి మొత్తం ఆరు వినతులు వచ్చాయి. వీటిలో ప్లానింగ్ విభాగానికి 2, ఇంజనీరింగ్ విభాగానికి 3, పరిపాలన విభాగానికి 1 చొప్పున అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, వి ఎం ఆర్ డి ఎ జిల్లా సమన్వయాధికారి మహేశ్వరరావు ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.





