తాడేపల్లిగూడెం, ( స్వతంత్ర ప్రభ )
డా. వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం మరియు రాజమహేంద్రవరంలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సంయుక్త ఆధ్వర్యంలో యువ వ్యవసాయ ఆవిష్కర్తల్లో పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఐదు రోజుల “స్పార్క్ 3.0 – ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎక్స్ప్లోరేషన్ బూట్క్యాంప్” నేడు ఘనంగా ప్రారంభమైంది. జూలై 21 నుండి 25, 2026 వరకు నిర్వహించబడనున్న ఈ శిక్షణా కార్యక్రమం వేంకటరామన్నగూడెంలోని డా. వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కళాశాల ప్రాంగణంలోని హార్టీ-బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ లో జరుగుతోంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డా. వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. కె. ధనుంజయరావు మాట్లాడుతూ, భారతదేశంలో ఆధునిక ఆవిష్కరణలు, పారిశ్రామిక అభివృద్ధికి విశేష సేవలందించిన రతన్ టాటా కృషిని స్మరించారు. గతంలో వివిధ విశ్వవిద్యాలయాల మధ్య ఏర్పడిన ఫలవంతమైన భాగస్వామ్యాలను ప్రస్తావిస్తూ, ఈ బూట్క్యాంప్ ఆ అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి ఆకాంక్షించిన “ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త” అనే లక్ష్య సాధనకుఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉద్యాన కళాశాల డీన్ డా. బి. ప్రసన్న కుమార్, విద్యార్థి వ్యవహారాల డీన్ డా. సి. మధుమతి, పారిశ్రామిక మరియు అంతర్జాతీయ కార్యక్రమాల సంచాలకురాలు డా. టి. పద్మలత, ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. ఎన్.బి.వి. చలపతిరావు, హెచ్బీఐసీ అధిపతి, విస్తరణ విద్య ప్రొఫెసర్ డా. ఈ. కరుణశ్రీ తదితరులు పాల్గొని ఉద్యాన రంగంలో పారిశ్రామిక అవకాశాలు, ఆవిష్కరణలు, స్టార్టప్ల ప్రాముఖ్యతపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.ఈ బూట్క్యాంప్కు ఎంపికైన విద్యార్థులు తమ ఆలోచనలు, లక్ష్యాలను పంచుకుంటూ, ఈ శిక్షణ తమలో పారిశ్రామిక దృక్పథాన్ని పెంపొందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి విలువైన అవకాశాన్ని కల్పించిన విశ్వవిద్యాలయానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.





