
విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)
జీవీఎంసీ దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు 35వ వార్డు మరియు 41వ వార్డుల పరిధిలోని పూర్ణ మార్కెట్, జ్ఞానపురం, గెడ్డ వీధి, పోస్ట్ ఆఫీస్ రోడ్డు, స్టేషన్ మెయిన్ రోడ్డు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు.ఈ సందర్భంగా 35వ వార్డులో పారిశుధ్య కార్మికులతో ప్రత్యేక అవగాహన సమావేశాన్ని నిర్వహించి, ప్రతి పారిశుధ్య కార్మికుడు ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకు విధులకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. ప్రతి ఇంటి నుంచి సేకరించే చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి సేకరించాలని, అలాగే ప్రతిరోజూ ఉదయం 7:00 గంటలలోపు ప్రధాన రహదారులన్నింటినీ పూర్తిగా శుభ్రపరచాలని ఆదేశించారు. రోడ్లపై ఎక్కడా చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగిస్తూ నగర పరిశుభ్రతను కాపాడాలని పారిశుధ్య కార్మికులకు సూచించారు.అనంతరం 41వ వార్డులోని జ్ఞానపురం, గెడ్డ వీధి, పోస్ట్ ఆఫీస్ రోడ్డు ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలు కాలువల్లో చెత్త వేయకుండా ఇంటి వద్దకు వచ్చే చెత్త సేకరణ వాహనానికే చెత్తను అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే స్టేషన్ మెయిన్ రోడ్డు పరిధిలోని వాణిజ్య సముదాయాలు, టిఫిన్ సెంటర్లు మరియు ఇతర వ్యాపార సంస్థలు ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నివారించి, పర్యావరణహిత ప్రత్యామ్నాయ కవర్లను ఉపయోగించాలని సూచించారు.రైల్వే స్టేషన్ మెయిన్ రోడ్డును ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రధాన రహదారులపై పారిశుధ్య కార్మికులను సమర్థవంతంగా వినియోగించి నిరంతర పరిశుభ్రతను నిర్వహించాలని సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డా. కృష్ణంరాజు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్ కుమార్, శానిటరీ సూపర్వైజర్ నీలిమ, 41వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్, శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు, సూపర్వైజర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.





