విశాఖ తూర్పు, (స్వతంత్ర ప్రభ)
సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా వి ఎం ఆర్ డి ఎ, నేరెడ్కో సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గురువారం వి ఎం ఆర్ డి ఎ చిల్డ్రన్ ఏరిన లో జరిగిన ఈ శిబిరాలను వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్ తేజ్ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ రక్తదానం చేయటం అంటే ప్రాణదానం చేసినట్లే అని పేర్కొన్నారు. సాటి మనిషి ప్రాణాలు కాపాడటంలో రక్తదానానికి మించింది లేదన్నారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన రక్తదాతలకు అభినందనలు తెలిపారు. ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించి రక్తదానం చేయాలని, ఇందుకు యువత ముందుకు రావాలని కోరారు. మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ వి ఎం ఆర్ డి ఎ సహకారంతో నేరెడ్కో ఇలాంటి రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుచేయటానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం వి ఎం ఆర్ డి ఎ మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్ తేజ్ భరత్ స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఆయన స్ఫూర్తితో పలువురు వి ఎం ఆర్ డి ఎ ఉన్నతాధికారులు కూడా స్వచ్ఛందంగా పాల్గొని రక్తదాన శిబిరంలో వి ఎం ఆర్ డి ఎ ఉన్నతాధికారులు కూడా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా 365 యూనిట్ల రక్తం సేకరించారు. కార్యక్రమంలో టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పట్టాభిరామ్, నేరెడ్కో రాష్ట్ర అధ్యక్షుడు చక్రధర్ , ప్రతినిధులు రమేష్ బాబు , హుస్సేన్, పాపారావు, సుబ్బారావు, పరశురామయ్య, పూర్ణచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.





