దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు
విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు వార్డు నెం. 34, 35 పరిధిలోని రామకృష్ణ బజార్, కొబ్బరితోట, అచ్చియమ్మపేట ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. పర్యటన సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపై మరియు కాలువల్లో చెత్తను వేయడాన్ని గుర్తించిన జోనల్ కమిషనర్, ఇటువంటి చర్యలు ప్రజారోగ్యానికి హానికరమని పేర్కొన్నారు. ముఖ్యంగా అచ్చియమ్మపేట ప్రాంతంలో ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఇకపై ఎవరూ రోడ్లపై లేదా కాలువల్లో చెత్త వేయబోమని ప్రజల నుండి సంతకాలతో కూడిన హామీ పత్రాలను సేకరించాలని సంబంధిత ప్రజారోగ్య విభాగ అధికారులను ఆదేశించారు.అదేవిధంగా ప్రతి ఇంటి వద్దకు వచ్చే పారిశుధ్య సిబ్బందికి లేదా చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే చెత్తను అందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, ఎవరైనా రోడ్లపై లేదా కాలువల్లో చెత్త వేస్తే జీవీఎంసీ నిబంధనల ప్రకారం అపరాధ రుసుము విధించబడుతుందని విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.రామకృష్ణ బజార్ ప్రాంతంలో కూరగాయల వ్యాపారులు తమ దుకాణాల వద్ద తప్పనిసరిగా డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకొని, వ్యర్థాలను పరిశుభ్రంగా నిర్వహించాలని జోనల్ కమిషనర్ ఆదేశించారు.వార్డు నెం. 34లోని అంబేద్కర్ కాలనీ పరిధిలో ఉన్న అన్ని అపార్ట్మెంట్లలో తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు ప్రత్యేక డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకొని, ఇంటి వద్దకు వచ్చే చెత్త సేకరణ వాహనాలకు వేర్వేరుగా అందించే విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్ నిరంతరం పర్యవేక్షించి సమర్థవంతంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్కు సూచించారు.ఈ పర్యటనలో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ కృష్ణంరాజు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్ కుమార్, శానిటరీ సూపర్వైజర్ నీలిమ,శానిటరీ ఇన్స్పెక్టర్లు శివప్రసాద్,మీనా కుమారి, శానిటేషన్ సెక్రటరీలు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.





