లక్ష్యం నిర్దేశించుకోండి… కష్టపడండి…
విద్యార్థులకు కలెక్టర్ హిమాన్షు శుక్ల దిశా నిర్దేశం…
నెల్లూరు, (స్వతంత్ర ప్రభ ప్రతినిధి )
నెల్లూరు నగరంలోని డీకే డబ్ల్యూ జూనియర్ కళాశాలలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో కలెక్టర్ హిమాన్షు శుక్ల విద్యార్థులతో మమేకమయ్యారు. వారిలో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారితో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారి భవిష్యత్తు లక్ష్యాలను కలెక్టర్ తెలుసుకున్నారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. తాను కలెక్టర్ కావడానికి ఒక ప్లాన్ ప్రకారం చదివిన విధానం, టార్గెట్ కోసం కష్టపడిన తీరును విద్యార్థులతో పంచుకున్నారు. ప్రణాళిక బద్దంగా కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని విద్యార్థుల్లో స్ఫూర్తినింపారు. టార్గెట్ ను ముందుగానే ఫిక్స్ చేసి దానికోసం శ్రమిస్తే విజయం మన సొంతం అవుతుందని వివరించారు. ప్రతి రోజు కొత్త విషయాలను నేర్చుకుంటూ, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని చెప్పారు. విజయానికి క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమే నిజమైన మార్గాలని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యా అవకాశాలను పూర్తిగా వినియోగించుకుని ఉన్నత స్థానాలను చేరుకోవాలని, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులతో ఆత్మీయంగా మమేకమై వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వారి ఆశయాలను సాకారం చేసుకునే దిశగా స్ఫూర్తినిచ్చారు.విద్యార్థులు కూడా కలెక్టర్ తో మమేకమై వారి సందేహాలను నివృత్తి చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐవో వరప్రసాద్, ప్రిన్సిపాల్ రమణారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.





