
తాడేపల్లిగూడెం. (స్వతంత్ర ప్రభ )
రాజమహేంద్రవరంలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో, వెంకట్రామన్నగూడెం ఉద్యాన కళాశాలలో జూలై 21 నుండి 25, 2026 వరకు “స్పార్క్ 3.0” పేరుతో నిర్వహించిన ఐదు రోజుల ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎక్స్ప్లోరేషన్ బూట్క్యాంప్ విజయవంతంగా ముగిసింది.ఉద్యాన విద్యార్థుల్లో వ్యాపార వ్యవస్థాపక దృక్పథాన్ని పెంపొందించడం, తదనుగుణంగా చుట్టూ ఉన్న సమస్యలను గుర్తించి వాటికి, శాస్త్రీయమైన వినూత్న పరిష్కారాలను రూపొందించు కొని వ్యాపార అవకాశాల్ని సృష్టించ గలిగే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించడం ఈ బూట్క్యాంప్ ప్రధాన ఉద్దేశ్యం అని ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. ఎన్ బి వి చలపతిరావు తెలియచేశారు.ఐదు రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమంలో డిగ్రీ , పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు పాల్గొని ఉద్యాన రంగంలో రైతులు, వినియోగదారులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను గుర్తించి, అర్ధం చేసుకొని, వాటికి నూతన పరిష్కారాలు అన్వేషిస్తూ, వాటిని వ్యాపార అవకాశాలుగా ఎలా మార్చుకోవచ్చో ప్రతి కీలక అంశాన్ని దశలవారీగా, ప్రాక్టికల్ పద్ధతిలో ఈ ఐదు రోజులు బోధించారు. వ్యాపార నమూనా అభివృద్ధి, ఆలోచనలను ధృవీకరించడం మరియు వాటిని పెట్టుబడిదారుల ముందుంచే స్థాయి వరకు అవసరమైన వ్యవస్థాపక నైపుణ్యాలను సమగ్రంగా విద్యార్థులు అభ్యసించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచనా విధానం, నాయకత్వ లక్షణాలు, సమస్య పరిష్కార సామర్థ్యం మరియు వ్యవస్థాపక దృక్పథాన్ని పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. భవిష్యత్తులో స్టార్టప్లు స్థాపించాలనుకునే యువతకు ఈ బూట్క్యాంప్ ఒక బలమైన పునాదిగా నిలిచిందని డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫ్ఫైర్స్ డా. సి. మధుమతి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డా. శశికళ, ప్రతినిధులు శ్రీయుతులు పి శ్రీధర్ నాయుడు, కె. చంద్ర ప్రకాశ్, టి. శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ ఐదు రోజుల శిక్షణలో పాల్గొన్న విద్యార్థులు తమ ఆలోచనలను వ్యాపార అవకాశాలుగా చూపిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయటం అందర్నీ ఆకట్టుకుంది.





