మహిళా సాధికారతకు సాంకేతిక రంగంలో నూతన దిశానిర్దేశం

తాడేపల్లిగూడెం (స్వతంత్ర ప్రభ.)
శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్లో ఐ.ఈ.ఈ.ఈ స్టూడెంట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఉమెన్ ఇన్ ఇంజనీరింగ్ 2026 కార్యక్రమం శనివారం కళాశాల సెంట్రల్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. “ఆవిష్కరణలు చేయడానికి, స్ఫూర్తినివ్వడానికి మరియు నాయకత్వం వహించడానికి మహిళలను శక్తివంతం చేయడం” అనే సందేశంతో నిర్వహించిన ఈ వేడుక మహిళా సాధికారత, సాంకేతిక విజ్ఞానం మరియు నాయకత్వ లక్షణాలపై విద్యార్థులకు స్ఫూర్తినిచ్చింది.ఈ కార్యక్రమంలో దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, పరిశ్రమ నిపుణులు పాల్గొని తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. డా. మినీ ఉలనాట్ “ఆమె గొంతు – ఆమె శక్తి” అంశంపై మహిళల నాయకత్వ ప్రాధాన్యతను వివరించారు. డా. జయంతి ఎన్.వి. ప్రత్యూష మహిళా ఇంజినీర్ల చరిత్రతో పాటు భవిష్యత్లో అందుబాటులో ఉన్న అవకాశాలను వివరించారు. డా. ఎం. వీర కుమారి ఏ ఐ యుగంలో కెరీర్ అవకాశాలపై, డా. వి. బాల నాగ జ్యోతి సముద్ర పరిశోధనల్లో ఆధునిక సాంకేతికత వినియోగంపై, డా. సంతాదేవి స్టెమ్ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అవకాశాలుగా మలచుకునే మార్గాలపై ప్రసంగించారు. చెన్నైకి చెందిన ఫుల్ స్టాక్ డెవలపర్ తాన్య శర్మ “సాంకేతికతకు మీ లింగం తెలియదు” అనే అంశంపై ప్రసంగిస్తూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ సాంకేతిక పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ శ్రీమతి ఎం. క్రాంతి సుధ, వైస్ చైర్మన్ శ్రీ ఎం. నరేంద్ర కృష్ణ, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మొహమ్మద్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. మహిళలు సాంకేతిక, శాస్త్రీయ మరియు నాయకత్వ రంగాల్లో మరింతగా రాణించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని వారు పేర్కొన్నారు. ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని కోఆర్డినేటర్ డా. పి. శివకుమార్ తెలిపారు.





