అధ్యక్షులుగా టిల్లపూడి నాగేశ్వరావు, కార్యదర్శిగా ఉబ్బిశెట్టి నారాయణరావు
శంఖవరం,(స్వతంత్ర ప్రభ)
కాకినాడ జిల్లా శాలివాహన సంఘ ఎన్నికలు ఆదివారం జగన్నాధపురం చిన్న మార్కెట్ సమీపంలోని శాలివాహన కమ్యూనిటీ హాల్ నందు ఘనంగా జరిగాయి. ఈ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాలివాహన సంఘ డైరెక్టర్ భీమాబత్తుల సత్యనారాయణ ఎన్నికల అధికారిగా వ్యవహరించి సజావుగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన శాలివాహన కుల బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా టిల్లపూడి నాగేశ్వరావు, కార్యదర్శిగా ఉబ్బిశెట్టి నారాయణరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా నక్కా శ్రీనివాసరావు, కోటిపల్లి సుబ్బారావు, వానపల్లి వెంకటరమణలు, జాయింట్ సెక్రెటరీలుగా అకేటి రాంబాబు, దేవగుప్తపు గణేష్, బిల్లకుర్తి శివాజీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులు బాధ్యతలు చేపట్టిన వెంటనే సంఘ అభివృద్ధికి, కుల సంక్షేమానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమానికి పసలపూడి ప్రసాదరావు, చంద్రశేఖర్, దుర్గాప్రసాద్, దాలిపర్తి శ్రీనివాసరావు, కొత్తూరు బాబురావు, అమలాపురం సత్యనారాయణ తదితరులు విశేష సహాయ సహకారాలు అందించారు. గౌరవ సంఘ నాయకులు వెల్ల పాపారావు, ఖండవల్లి వీరభద్రం, టిల్లపూడి విశ్వనాథం, కృష్ణ నమశ్శివాయ, దాలిపర్తి ప్రకాష్ లను నూతన కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడిన పూర్వ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సంఘం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కుల బంధువుల ఐక్యతతోనే సంఘం బలోపేతమైందని, నూతన కమిటీ మరింత ఉత్సాహంగా పని చేసి కులానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం నుండి బీసీ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యేలా పోరాడాలని, విద్యార్థులకు స్కాలర్షిప్లు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరావు మాట్లాడుతూ పెద్దల ఆశీర్వాదంతో, కుల బంధువుల సహకారంతో సంఘాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్ గా నిలుపుతామని అన్నారు. ప్రతి మండలంలో శాలివాహన భవన నిర్మాణానికి కృషి చేస్తామని, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, వైద్య సహాయం అందించే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యదర్శి ఉబ్బిశెట్టి నారాయణరావు మాట్లాడుతూ యువతను ముందుకు తీసుకువచ్చి సంఘ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తామని, ప్రతి గ్రామంలో కమిటీలను ఏర్పాటు చేసి కుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.కార్యక్రమానంతరం అందరూ కలిసి భోజనాలు చేస్తూ ఒకరికొకరు పరిచయాలు చేసుకుని సోదరభావాన్ని చాటుకున్నారు





